Thursday 6 March 2014

భవిష్యత్తు భారతం..

లోక్ సభ, అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యుల్సును ప్రకటించడంతో రాబోయో రెండు నెలల్లోపు మనం తీసుకోబోయే నిర్ణయం బట్టే రాబోయో భారతదేశం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒకెత్తు ఆయితే, ఇప్పటి జరుగబోతున్న ఎన్నికలు ఒకెత్తు అని చెప్పుకోవచ్చు.. ఇప్పటి వరకు సుస్దిర పాలన ఇవ్వగలిగిన పార్టిలకు ప్రజలు మద్దతు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వాలు కూడా సుస్దిర  పాలనను అందివ్వడం ద్వారానే ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్దమయ్యేవి...

తరాలు మారినప్పుడల్లా అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశలు, కలలు మారుతూ వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడూ నయా కొత్త తరం ఉద్బవించింది. వీరు ఇప్పుడు భారత దేశాన్ని అభివృద్ధి పధంలో తీసుకువెళ్ళగలిగే సమర్దుడైన నాయకుడు కోసం ఎదురుచూస్తున్నారు. మాటల నాయకుడుని కాకుండా చేతల నాయకుడుని కోరుకుంటున్నారు.

ఆయితే ఇప్పుడున్న ప్రధాన అభ్యర్దులు నరేంద్రమోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇంకా ఇతరులెవరైనా దేశప్రజానీకానికి పూర్తి స్దాయి భరోసా ఇవ్వలేకపోతున్నారు.

అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ణానంను ఉపయోగించుకొని ప్రభుత్వాలు చేస్తున్న పనులను దేశయువత ప్రతి క్షణం కనిపెడుతూ ఉంది. గతంలో ప్రభుత్వాలు చేసిన మంచి పనులైనా, చెడు పనులైనా బయట ప్రజానీకానికి తెలియాలంటే న్యూస్ పేపర్లు లేదా టెలివిజన్ ఒకటే అవకాశంగా కనిపించేంది. కానీ ఇప్పుడలా కాదు., పెరిగిన సాంకేతిక పరిజ్ణానంను ఉపయెగించుకొని ప్రభుత్వాలు చేసే ప్రతి పనిని నిమిషాల్లోనే మీడియా, సామాజిక అనుసంధాన వేదికల ద్వారా దేశ ప్రజానీకానికి కళ్ళ ముందు ఉంచుతున్నాయి.

భారత దేశం ప్రధాని పదవికి పోటిదారులుగా ఉన్న రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ లు సరిగ్గా ఈ అంశాన్ని పసిగట్టి, సామాజిక అనుసంధానాలు, మీడియా ద్వారా సాధ్యమైనంత తర్వగా ప్రజల్లోకి దూసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయితే ఇందులో నరేంద్ర మోడితో పోల్చుకుంటే రాహుల్ గాంధీ వెనుకబడిపోయారు.

నేడు యువతలో మోజారీటి భాగం దేశంలో జరుగుతున్న పలు పరిణామాలను సామాజిక అనుసంధాన వేదికల ద్వారానే తెలుసుకుంటున్నారు. ఈ విషయంను మోడీ త్వరగానే గ్రహించి ట్విట్టర్, ఫేసుబుక్కు తదితర అనుసంధానల ద్వారా సుమారు రెండు సం.రాల నుండే ప్రచారం షురు చేసారు.

ఆయితే మనం ఎవరికి మద్దతు ఇవ్వాలి??
రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి అభ్యర్దిగా కాంగ్రెసు పార్టి అధికారికంగా ప్రకటించనప్పటికి కాంగ్రెసు గెలిస్తే రాహుల్ ప్రధాని అభ్యర్ది కాగలడని అందరికి తెలుసు.. ఆయితే ఇప్పుడు ఎన్నికలు “భారతదేశానికి సమర్ద నాయకుడు ప్రధానిగా కావలెను” అని దేశయువత బలంగా కోరుకుంటున్న ఈ సమయంలో రాహుల్ గాంధీ వెనుకబడిపోయారు.

ఒకప్పుడు ఇదే రాహుల్ గాంధీ గురించి, ఆయన చేస్తున్న పనులు గురించి మెచ్చుకుంటూ ఒక అర్టికల్ రాయడం జరిగింది. ఆయితే ఆ అర్టికల్ ఇప్పుడు చదివితే ఆ అభిప్రాయం సరికాదెమో అన్న ఫీలింగ్ కల్గుతుంది. దీనిని బట్టి అప్పటి నుండి నేటి వరకు గడిచిన కాలములో ఆయన తన పరపతిని ఎలా కోల్పోయారో అర్ద్రమవుతుంది.

ఆ సమయానికి కాంగ్రెసు ప్రభుత్వంలోని పలు కుంభకోణాలు పూర్తిగా బయటపడలేదు. మరియు నరేంద్ర మోడీ హవా కూడా దేశరాజకీయాల్లో పెద్దగా లేదు. ఆ కారణంగా ఆ సమయంలో రాహుల్ గాంధీని సమర్దుడైన భవిష్యత్తు ప్రధానిగా కోరుకున్నాము.

తదనంతర కాలంలో కాంగ్రెసు ప్రభుత్వం పలు అవినీతి అరోపణల్లో కూరుకుపోవడం, రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో పేదలు ఇళ్ళ సందర్శన అనేది కేవలం ప్రచార అర్బాటంగానే ఉండిపోవడం, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి తెలియనట్టుగా ఉండడం, పలు అంశాల పట్ల పూర్తి స్దాయి పట్టు లేకపోవడం వంటి పలు కారణాలు వలన రాహుల్ గాంధీ యొక్క్ గ్రాఫ్ స్దాయి తగ్గిపోయింది.

ఆయితే దీన్నే మనం మరో రకముగా చెప్పుకోవచ్చు. అప్పుడున్న పరిస్దితుల్లో దేశ నాయకుడిగా యువకులు ఉంటే అభివృద్ధిపరంగా దూసుకువెళ్ళొచ్చునన్న భావనతో రాహుల్ గాంధీ ప్రధాని రేసులో మొదటి స్దానంలో ఉండాలని చాలా మంది కోరుకున్నారు. కొంత మందయితే రాహుల్ వెంటనే ప్రధాని పదవి చేపట్టాలని కోరుకున్నారు కూడా......

ఆయితే నరేంద్ర మోడీ రూపంలో రాహుల్ ప్రతిష్ట దిగజారిపోతుందని ఎవరూ ఊహించలేదు.  రాహుల్ తన సామర్ద్యంను నిరూపించుకొనే అవకాశం రాకుండానే మరో సమర్దనాయకుడు వెలుగులోకి రావడం మూలంగా వన్నె కోల్పోయారు. దానికి తోడు ప్రభుత్వాలను ప్రభావితం చేయగల స్దితిలో ఉండీ కూడా మాటలు/ప్రచారం ద్వారానే కాలం వెళ్ళబుచ్చడంతో నెమ్మనెమ్మదిగా ప్రభ కోల్పోవలసివచ్చింది. 

ఆయితే నరేంద్ర మోడీ గుజరాత్ లో వరుసగా మూడవ సారీ పార్టిని విజయపధంలో నిలిపి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంతో దేశం దృష్టి మొత్తం మోడీ వైపు మళ్ళీంది. రెండవ పర్యాయం గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కష్టమవుతున్న ప్రస్తుత తరుణంలో వరుసగా మూడు సార్లు విజయం సాధించగలగడం అనే కారణంగా నరేంద్ర మోడీ పేరు దేశవ్యాప్తంగా యువత దృష్టిని అకర్షించింది. సరిగ్గా దీన్నే మోడీ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతులయ్యారు. 
దేశ ప్రజానీకం కూడా మోడీ విజయం వెనకున్న కారణాలు విశ్లేషించడం మొదలెట్టాయి. గత పది సం.రాలుగా ఎవరికి పట్టని గుజరాత్ అభివృద్ధి గురించి మీడియాలోను సామాజిక అనుసంధాన వేదికలోను పుంఖాను పుంఖానులుగా పబ్లిసిటి వచ్చింది.  దానితో ఎన్.డి.ఎ. తరపున బలమైన ప్రధాని అభ్యర్ది కోసం ఎదురుచూస్తున్న బిజెపికి మోడీ అందుకొక అవకాశంగా కనిపించారు. మోడీని ప్రధాని అభ్యర్దిగా చేయాలన్న డిమాండ్ బిజెపిలో నెమ్మదిగా రావడం మొదలయింది.

ఇక్కడ నుండే మోడీ కూడా క్రియాశీలకంగా వ్యవహరించేలా తన ప్రణాళికను రూపొందించుకున్నారు. గుజరాత్ లో మూడవ సారి గెలుపొందడం ద్వారా వచ్చిన ప్రచారంను ఉపయెగించుకొని తన యొక్క నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పేలా గుజరాత్ అభివృద్ధిని చూపించి తన హవాను పెరేగేలా వ్యూహరచన చేసారు. గుజరాత్ అభివృద్ధిని చూపించి తాను చేతల మనిషినని, రాహుల్ లా మాటల మనిషిని కాదని ప్రజానికం మనస్సుల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసారు. దానితో దేశం మొత్తానికి మోడీ గురించి తెలిసింది. దానితో రాహుల్ గాంధికీ, మోడీకి పోలిక తేవడం మొదలెట్టాడంతో చివరికి అది రెండు పార్టిల మధ్య పోటీగా కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీగా మారిపోయింది.

బిజెపిలో చాలా మంది సీనియర్ నాయకులకు ఇష్టం లేకపోయినప్పట్టికీ, ఆర్.ఎస్.ఎస్. ప్రొదల్బంతో మోడీని ప్రధాని అభ్యర్దిగా బిజెపి ప్రకంటించింది. అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి నాయకులకు సదరు చర్య ఏ మాత్రం రుచించనప్పటికీ మోడీకి గల ప్రజాదరణ చూసి మిన్నకుండిపోయారు.

ఆయితే అమాంతం పెరుగుతున్న మోడీ ప్రభంజనాన్ని నివారించడానికి కాంగ్రెసు కానీ, రాహుల్ కానీ ఎటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కనిపించలేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాహుల్ గాంధీ వరుసగా జాతీయ చానల్స్ తో మీట్ ద ప్రెస్ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ వాటిలో రాహుల్ తెలివితేటలు కన్నా, చాలా విషయాల్లో తనకు గల అజ్ణానాన్నే బయటపెడుతున్నాయి.

నరేంద్ర మోడీ ఒక్క సారిగా తెరపైకి దూసుకురావడం మూలన రాహుల్ గాంధీ ప్రధాని పదవి సరయిన సమర్దుడు కాదన్న విషయము ప్రజానీకంలోకి వేగంగా వెళ్ళిపోయింది. దానితో మోడీయే భారత దేశానికి సారధిగా ఎన్నుకోవలసిన పరిస్దితి కనిపించసాగింది.

ఆయితే నరేంద్రమోడీ గుజరాత్ ను అభివృద్ధి పధంలో నడిపించినప్పటికీ, ఆ సామర్ద్యం భారతదేశాన్ని అభిపృద్ధి పధంలో నడిపించడానికి సరిపోతుందా అన్న సంశయం నేడు చాలా మందికి వచ్చింది.

నరేంద్రమోడీ గుజరాత్ లో చేసిన అభివృద్ది  నాణెంనకు ఒక వైపు మాత్రమేనని, గుజరాత్ లో అభివృద్ధంతా కేవలం పారిశ్రామికవేత్తల్లోనే జరిగింది తప్ప క్రిందిస్దాయిలో జరగలేదన్న విమర్శలు లేకుండా లేవు.
అదే విషయాన్ని అరవింద్ కేజ్రివాల్ ప్రముఖంగా ప్రశ్నిస్తున్నారు. ఆయితే ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటు మరియు రాజీనామా తర్వాత అరవింద్ కేజ్రివాల్ మీద ఉన్న ఆశలు పటాపంచలయ్యాయి. ఆరు నెలల క్రితం వరకు అరవింద్ కేజ్రివాల్ ను కూడా సమర్దుడైన ప్రధాని అభ్యర్దిగా భావించిన వారిలో చాలా మంది నేడు తమ అభిప్రాయంను మార్చుకోవడం ఇక్కడ గమనార్హం.

మరి మనం ఎవరిని ఎన్నుకోవాలి??? అన్న మీమాంస నాలాంటి వారిలో ఉంది.

ఇప్పటి వరకు నరేంద్ర మోడీ మీదే సానుకూల అభిప్రాయం ఉండేది. ఆయితే మొన్న పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్దికరణ బిల్లు అమోదం సందర్భంగా ఆ పార్టి వ్యవహరించిన తీరు చూసి నరేంద్ర మోడీని కూడా విశ్వసించలేమోనన్న అభిప్రాయం కల్గింది. ఆయితే కేవలం మనం రాష్ట్ర స్దాయిలో ఉండి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో బిజెపి వ్యవహర శైలి ఆమోదయోగ్యం కానప్పట్టికి దేశహితవును పరిగణనలోకి తీసుకుంటే మోడీనే ఎన్నుకోవల్సిన అగత్యం ఏర్పడింది.

ఆయితే దీనికి ప్రధాన కారణంగా నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఇష్టం లేని సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు మోడీని దెబ్బతీయడానికి పార్లమెంటులో ఆ విధంగా వ్యవహరించుకొచ్చారు. వాస్తవానికి అద్వానీకి, మోడీనకు అప్పటి రాష్ట్రవిభజనకి వ్యతిరేకమని కొంత మంది స్నేహితులు చెప్పుకొచ్చారు.

ఆయితే దానిని కూడా సమర్దించడానికి వీల్లేదు. ఎందుకంటే పార్టిలో ఫైనల్ నిర్ణయమును అమలు చేయించుకోలేని వ్యక్తి దేశ ప్రధానిగా ఏ విధంగా సమర్దంగా వ్యవహరించగలరని మనము అనుకోగలము.

ఆయితే కాంగ్రెసు ప్రభుత్వంలో చోటుచేసుకున్న పలు కుంభకోణాలు, మరియు అర్దిక పతనం వైపుగా భారత్ ని దిగజార్చిన దృష్ట్యా తిరిగి కాంగ్రెసుని ఎన్నుకొనే పరిస్దితి దేశములో లేదు. రాహుల్ గాంధీ మీద ఉన్న భ్రమలు కూడా ప్రజలకు పోయింది.

అదే విధంగా ఆమ్ అద్మీ పార్టీ స్దాపించడం ద్వారా దేశ రాజకీయాల్లో పలు మార్పులకు శ్రీకారం చూడదమనుకున్న అరవింద్ కేజ్రివాల్ మీద కూడా ఎవరికి భ్రమలు లేవు.

ఇన్ని అనుకూలతలు, ప్రతికూలతల మధ్య భారతదేశాన్ని ఎవరు ముందుకు తీసుకువెళ్తారో భవిష్యత్తే నిర్ణయించగలదు.