Tuesday 29 July 2014

చెంపదెబ్బ


వందకి వంద వచ్చిన మార్కుల జాబితా పట్టుకొని నాన్నగారి దగ్గరికి సంతోషంగా వెళ్ళి జాబితా చేతికి అందించాను.  ఆయన ఆ మార్కుల జాబితాను చూసి తల పంకించి నిదానంగా లేచి నిలబడ్డారు. బహూశా మెచ్చుకోలుగా చూస్తారేమో అనుకున్నాను. కానీ ఆ కళ్ళు చూస్తుంటే అలా అనిపించలేదు. కొద్దిగా భయంగా అనిపించినా అలానే నిలబడ్డాను. నింపాదిగా లేచి నిలబడ్డ నాన్న నా వైపు కాసేపు ఎగాదిగా చూసి చెంప చెల్లుమనిపించారు.

నాకు తొలిసారి ఒక సబెక్టులో వందకి వంద రావడం ఎంత వాస్తవమో, నాన్న తొలిసారిగా నా చెంప చెల్లుమనిపించడం కూడా అంతే వాస్తవం.....

ఎందుకు, ఏంటో తెలుసుకోవాలంటే మనం గతంలోకి దూకాలి.

                                                ***

ఆ రోజు పొద్దున్నే వచ్చిన న్యూస్ పేపర్ లో ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ పరీక్షల ఫలితాల్లో నా హాల్ టికెట్ నెంబరు కనబడగానే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం కల్గింది. వెంటనే స్నానం చేసి రెడీ ఆయిపోయి మార్కులు కోసం కాలేజి టైమ్ కన్నా ఒక గంట ముందే పోయి కూర్చున్నా... కాలేజి టైమ్ ఆయిన అరగంటకి గ్గానీ రాలేదు ఆఫీసు స్టాఫ్ ఎవరూ. ఆ తర్వాత ఆఫీసు స్టాఫ్ దగ్గరకు వెళ్ళి నా మార్కులు తీసుకున్నా.. అందులో నాకొచ్చిన మార్కులు చూడగానే నా కళ్ళింతలయ్యాయి. అప్పటి వరకు వ్రాసిన ఏ పరీక్షలోనూ కూడా అన్ని మార్కులు రాలేదు.  నాకు బాగా ఇష్టమైన  మ్యాధ్స్ లో కూడా. కాని ఇప్పుడు అదే మ్యాధ్స్ లో 100 కి 100 వచ్చాయి.

నమ్మలేకపోయాను.. ఆయినా కళ్ళెదుట ఉన్న మార్కులు అది నిజమని చెబుతున్నాయి.

నేను చిన్నప్పటి నుండి చదువులో యావరేజి స్టూడెంట్ నే.. ఏనాడు క్లాస్ ఫస్ట్ రాలేదు. అలాగని చివర నుండి ఫస్ట్ రాలేదు. ఏదో చదువుతున్నాము, మార్కులు వస్తున్నాయి అనే టైపు.  ఆయితే లెక్కల్లో మాత్రం నా ప్రతిభ ఆఘెఘం. ఈ మాట నేనంటున్నది కాదు.. క్లాస్ మారిన ప్రతిసారి, లెక్కలు మాస్టార్లు మారిన ప్రతిసారీ, వారి నుండి నాకొచ్చిన కాంప్లిమెంటు అది. అందుకనే నా పదవ తరగతి వరకు మాకు వచ్చిన ప్రతి లెక్కల మాస్టారుతోనూ నాకు అనుబంధం ఎక్కువే..   కానీ అదేం విచిత్రమే తెలీదు కానీ, ఏ క్లాస్ లో కానీ, ఏ పరీక్షలో కానీ లెక్కలు వందకి వంద మార్కులు వచ్చిన పాపాన పోలేదు.

నేను ఏడవ తరగతిలో ఉండగా అనుకుంటాను, మా ఊరి స్కూలుకి రంగారావు గారని లెక్కల మాస్టారు బదిలీ మీద వచ్చారు. కొద్ది కాలంలోనే ఆయనకు నేను బాగా దగ్గరయిపోయాను. నేనంటే ఎంతో ఇష్టం చూపించేవారయన. ఒక సారి రంగరావు మాస్టారు బ్లాక్ బోర్డు మీద శాంపిల్ ఒక లెక్క చెప్పి, టెస్ట్ బుక్ లో ఉన్న మిగతా లెక్కలను చేసి చూపించమని క్లాస్ లో ఉన్న విద్యార్దులందరీకి ఆదేశించారు.  

అందరి కంటే ముందుగా నేను పూర్తి చేసి మాస్టారుకి చూపించాను. నాతో పాటుగా అప్పారావు, రాజుబాబు కూడా వెంటనే పూర్తి చేసేసారు. కొద్ది సేపటికి మిగతావారు కూడా చూపించుకుంటూ పోతున్నారు. అప్పుడు నేను మాస్టారి వెనుక నిలబడియున్నాను. అదేంటొ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాగానే చేసి చూపిస్తున్నారు. అదే పరీక్షలో రాయవలసి వచ్చేసరికి ఒక్కడికి సరిగా బల్బు వెలగదు ఏమిటో అన్నా. మాస్టారు ఆ మాటలు విని, నిజమే గదరా ఇప్పుడు బానే చేయగల్గిన వారు పరీక్షలో మాత్రం బాల్చి తన్నేస్తారు ఏంటో అని నిటూర్చారు. .

నేనంటే ఎంత ఇష్టమె ఆయనకు అనుకొని ఎంతో సంతోషపడిపోయేవాడిని. 

ఆయితే అలాంటి వారిలో నేను ఒకడినే అని ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో గానీ తెలియరాలేదు

త్వరలోనే ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పుడంటే పెద్దగా విలువ లేదగ్గాని, అప్పుడంటే ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు పెద్ద హంగామానే.  రంగారావు మాస్టారు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పరీక్షలో నాకు వచ్చిన మార్కులు 56. ఫస్ట్ క్లాస్ 65 మార్కులు అప్పారావు గాడికి వచ్చినవి. అంత కంటే మా స్కూలు నుండి ఎవరికీ ఎక్కువ మార్కులు రాలేదు. మా స్కూలులో ఏడవ తరగతి వరకు మాత్రమే ఉండడంతో మాస్టారికి అత్మీయ వీడ్కోలు వేడుక ఏర్పాటు చేసాము.

ఆ వేడుకలో రంగారావు మాస్టారు మాట్లాడుతూ నన్ను ఉద్దేశించి, నా సబ్బెక్టులో వందకి వంద మార్కులు తెచ్చుకొని నాకు గౌరవం తెచ్చిపెడతాడనుకున్నా. కానీ ఇంత తక్కువ మార్కులు తెచ్చి నాకు తలవంపులు తెస్తాడని అనుకోలేదు అని భాధపడ్డారు. ఆనాడు రంగారావు మాస్టారు ఆన్న మాటలకి నేను చాలా భాదపడిపోయాను. మాస్టారిని కల్సి పరీక్ష చాలా బాగా రాసానని, ఆయినప్పటికీ ఇంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయో అర్ద్రం కావడం లేదని ఆయన కాళ్ళ మీద పడిపోయినంత పని చేసాను. దానికి ఆయన నవ్వుతూ నీ మీద నాకు నమ్మకముందిరా... ఇందులో మార్కులు రానంత మాత్రనా నీకు లెక్కలు రావని ఎవడూ అనగలర్రా నిన్ను... నీవు ఎప్పుడూ నెంబర్ వన్ స్టూడెంట్ వే. నీవు ఇలా డీలా పడిపోతే ఎలా అని అనుసయించి ఇంకా బాగా చదువుకోమని దీవించి పంపించారు.  ఆయన చూపిన అభిమానం చూసి నా మీద  నాకే కోపం వచ్చింది. నా లెక్కల పేపర్ వాల్యూయేషన్ చేసినవాడిని తిట్టుకుంటూ ఎనిమిదో తరగతిలో జాయినవడానికి కాకినాడ వచ్చేసాను.

నాన్నగారు ఉద్యోగరీత్యా కాకినాడలో ఉంటూ అడిట్ శాఖలో పనిచేసేవారు.అప్పటి వరకు ఆయన ఒక్కరే ఎన్.జి.ఒ.హోమ్ లో రూమ్ తీసుకొని ఉండేవారు. వారాంతంలోను సెలవుల్లోను నాన్న ఇంటికి వచ్చేవారు. ఇక్కడ తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, నేను, చెల్లి ఉండేవాళ్ళం.

అప్పటి వరకు నాన్న గారు ఉద్యోగరీత్యా మాతో ఉండకపోవడం వలన ఇంటికి వచ్చినప్పుడు నన్ను, చెల్లిని బాగా చూసుకొనేవారు. క్రమశిక్షణ అలవాటు చేయడానికి ఎవరో ఒకరు కఠినంగా ఉండాలి కాబట్టి, ఆ భాద్యత అమ్మ తీసుకుంది. అందువలన నా ఏడవ తరగతి ఆయ్యే వరకు కఠినంగా ఉండే అమ్మ కన్నా, ప్రేమతో కబుర్లు చెప్పే నాన్నంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది నాకు. మా ఊర్లో ఏడవ తరగతి వరకే ఉండడంతో పై చదువులు కోసం నాన్న ఉంటున్న కాకినాడకి మకాం మారింది.

ఆయితే అప్పటి వరకు అమ్మ తీసుకున్న క్రమశిక్షణ బాధ్యతని నాన్న తీసుకోవడంతో, ఆయన మీద భయం పెరిగి అమ్మ అంటే ఇష్టం పెరిగింది. నాన్నకి మా మీద ప్రేమ ఉన్నప్పట్టికి మమకారం మమ్మల్ని ఎక్కడ తప్పుదోవ పట్టిస్తుందన్న భయంతో నాన్న మాత్రం కాఠిన్యతని మెయినుటెయిను చేసేవారు.

అది కాస్తా నాకు, నాన్నకి మధ్య మానసికంగా దూరం పెంచింది. అమ్మ మాత్రం నాతో చాలాసార్లు చెబుతుండేది, నాన్నకి నేనంటే చాలా ఇష్టమని. కానీ పైకి చూపించేవారు కాదు. ఆ విధంగా నాన్న మీద ప్రేమ కాస్తా భయం రూపంలోకి మారింది.

ఎనిమిదో తరగతి కార్పోరేటు కాన్వెంటులో చేర్పించారు. ఆయితే అక్కడ మాస్టార్లు అంతా యాంత్రికంగా పాఠాలు చెప్పుకుంటు పోవడమే తప్ప మాతో సన్నిహితంగా మెలిగే వాతావరణం అక్కడ కనిపించలేదు. దానితో ఎనిమిది నుండి పదో తరగతి వరకు ఏ లెక్కల మాస్టారితోనూ సాన్నిహిత్యం ఏర్పడలేదు.

ఆ తర్వాత ఐడియల్ కాలేజిలో ఇంటర్ జాయినయ్యాను. అక్కడ ఒక పూట మాత్రమే కాలేజి క్లాసులు జరిగేవి. మిగతా పూట ఖాళీనే.. ఆయితే కాలేజిలో నోట్సు తయారుచేసుకోవడానికి పెద్దగా అవకాశం లేకపోవడంతో బయట ట్యూషన్స్ జాయినయ్యాము. అదిగో అప్పుడే  మరల మంచి లెక్కల మాస్టారు పరిచయమయ్యారు.

ఆయన గిరిశం గారు. మనిషి కొద్దిగా పొట్టిగా ఉండేవారు. కానీ మనసు మాత్రం వెన్న. ఒంటి మామిడి జంక్షన్ నుండి అచ్యుతాపురం రైల్వే గేటు వైపు వెళ్ళే దారిలో గేటుకి ఇవతలి వైపు ఎడమచేతి వైపు ఉన్న సందులాంటి రోడ్డులో ఉండేది ఆయన చెప్పే ట్యూషన్ క్లాస్. లెక్కలు ఎంత చక్కగా భోదించేవారో, అదే విధంగా అంతే ప్రేమగా చూసేవారు. డౌట్ ఉంటే అర్ద్రం ఆయ్యేంత వరకు ఎన్నిసార్లు ఆయినా విశదికరించేవారు.  ఆయనకు కట్టవలసిన ఫీజు గురించి ఎవరినీ కూడా అడిగేవారు కాదు. ఎవరు తెచ్చి ఇస్తే వాటినే పుచ్చుకొనేవారు తప్ప ఏనాడు కూడా నోరు తెరిచి అడగలేదు. విద్యను భోధించడం బాధ్యతగానే చూసారు తప్ప కమర్షియల్ కోణంలో చూడలేదు.

ఏడవ తరగతిలో రంగారావు మాస్టారు తర్వాత, మరల ఇంటర్ లో గిరిశం గారితోనే నాకు అనుబంధం ఏర్పడింది.  నేను, వల్లీనాధ్, నాగూర్ బాబు అంటే అభిమానం చూపించేవారయన.. నాగూర్ బాబు అంటే సినీ నేపధ్యగాయకుడు కాదండోయ్... నా స్నేహితుడు మాత్రమే. ఇప్పుడు అతను టీచర్ గా పనిచేస్తున్నాడులెండి.
క్లాసులో మాకు కొన్ని లెక్కలు ఇచ్చి సాల్వ్ చేసి చూపించమనేవారు. నన్ను, వల్లీనాధ్, నాగూర్ బాబులను మాత్రము అందరికన్నా చివర చూపించమనే వారు. అదేంటి సార్! అని మేమడిగితే మీకు ఎలాగూ వచ్చు కదరా ఆ లెక్కలు అనేవారు. ప్రతి ఆదివారం మాకు ఎగ్జామ్ పెట్టేవారు. అందులో క్వశ్చన్స్ అన్నింటికి అన్సర్ చేసేవాడిని కానీ, ఎప్పుడూ పూర్తి మార్కులు వచ్చేవి కావు.


ఒక సారి గిరిశం గారు పిలిచి నా ఎగ్జామ్ పేపర్ చేతిలో పెట్టి దాని మీద ఉన్న నా పేరు చదవమన్నారు. నా పేరుని ఎప్పుడూ కూడా పూర్తిగా రాసే అలవాటు ఉండేది కాదు. అంటే రాజీవ్ రాఘవ్ ని ఇంగ్లీషులో రాసేటప్పుడు మొదటి మూడు అక్షరాలు మాత్రమే సరిగా రాసి మిగతా వాటిని గీతలా సాగదీసి పైన పెట్టిన పోటొలో పెట్టినట్టుగా పెట్టేసేవాడిని. అలాగే మ్యాధ్స్ పేపర్ లోని అంశాల వారీగా చేయవలసిన అన్సరింగ్ ని చాలా షార్ట్ కట్ లో చేసేసేవాడిని. అంటే ముందుగా ఆ లెక్కకు చెందిన ఫార్ములా వేయడం, దాని క్రింద వాల్యూస్ వేయడం, వెంటనే దాని క్రింద ఫైనల్ ఆనర్స్ వేయడం మాత్రమే చేసేవాడిని. అంతే కాని ఆ కొశ్చన్ కి ఇచ్చిన మార్కులు ఆధారంగా స్టెప్ బై స్టెప్ గా సవివరంగా చేసేవాడిని కాదు. ఎన్ని మార్కులు క్వొశ్చన్ ఆయిన సరే మూడు స్టెప్స్ లో మాత్రమే ఆన్సరింగ్ చేసేవాడిని. దానితో వాటికి పుల్ మార్కులు పడేవి కాదు.

నా పేరు రాసిన విధంగానే నేను ఎగ్జామ్స్ లో చేసే అన్సరింగ్ అలానే తగలాడింది అని సుతిమెత్తగా మందలించారు గిరిశం మాస్టారు. ఈ సారి ఎప్పుడైనా పేరు కానీ, ఆన్సరింగ్ కానీ పూర్తిగా చేయకపోతే జిరో మార్కులే వేయవల్సిఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చేసారు.

ఆ తర్వాత వచ్చిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మన హాల్ టికెట్ నెంబర్ కనబడ్లేదు. జీవితంలో మొదటి సారి ఫెయిల్ అంటే ఏంటో చూడడం. అన్ని సబ్జెట్టులు బాగానే రాసినా ఎందుకు ఫెయిల్ ఆయ్యానో అర్ద్రం కాలేదు. ఫెయిల్ ఆయ్యానన్న బాధ కన్నా నాన్న గారు ఎలా రియాక్ట్ ఆవుతారో అన్న భయం ఎక్కువయింది. ఆ సమయంలో నేను మా చిన్నాన్న గారి ఇంటి వద్ద ఉన్నాను. మా బంధు వర్గంలో నేను బాగా చదువుతానని కొద్దోగొప్పో పేరుండేది. ఇప్పుడు ఇలా ఫెయిల్ అవ్వడం చిన్నాన్నే నమ్మలేకపోయారు.

ఆయితే తిరిగి ఒక నెల రోజుల వ్యవధిలో సంప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆయితే నాకు తిరిగి కాకినాడ్ వెళ్ళడానికి ధైర్యం చాల్లేదు. దానితో చిన్నాన్న నన్ను తీసుకెళ్ళి, కాకినాడలో దింపి నన్ను ఏమనొద్దని నాన్న గారితో చెప్పి వెళ్ళిపోయారు. చిన్నాన్న వెళ్ళిపోయిన తర్వాత నాకు బ్యాండ్ బాజా గ్యారంటీ అనుకున్నా. కానీ ఆశ్చర్యకరముగా నాన్న గారు నన్ను ఏమనలేదు.

అంతకన్నా ఆశ్చర్యకరముగా నేను ఫెయిలయింది మ్యాధ్స్ సబ్జెట్టులో. నమ్మలేకపోయాను. ఆయితే ఇప్పటిలా రీవాల్యూయేషన్ చేయించడాలు అవీ అప్పుడు చాలా తక్కువ కాబట్టి ఆ సాహసం చేయలేదు. వెంటనే సంప్లిమెంటరీకి అప్లై చేసి వందకి వంద మార్కులు తెచ్చుకున్నాను. ఈ నెల రోజుల కాలంలో నాన్న గారు నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు.

ఆ ధైర్యంతో మరియు తొలిసారిగా మ్యాధ్స్ లో వందకి వంద వచ్చిన ఆనందంతో నాన్నగారి వద్దకి వెళ్తే ఆయన నాకు ఇచ్చిన బహుమతి “చెంపదెబ్బ”...

తలదించుకొని నేల దిక్కులు చూస్తూ ఉండిపోయాను. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. అమ్మ నా దగ్గరకి వచ్చి భుజం చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకుంది.

తిరిగి కుర్చీలో కూర్చున్న నాన్నగారు అప్పుడు అన్నారు.  

చూడు రాజీవ్.. నాకు మార్కులు ఇంపార్టెంట్ కాదు. ఆయితే ఫస్ట్ మార్కులు వచ్చినా, ఫెయిల్ ఆయినా ఒకేలా తీసుకోవాలి. ఫెయిల్ ఆయినప్పుడు దూరంగా పారిపోయి చిన్నాన్న తో రికమెండేషన్ చేయించడంలు, ఫస్ట్ మార్కులు వచ్చినప్పుడు నా దగ్గరకి ఎగురుకుంటూ రావడం పద్దతి కాదు. నువ్వు ఫెయిల్ ఆయిన రోజే నా దగ్గరకి వచ్చి నాన్న గారు నేను ఇందులో ఫెయిల్ అయ్యాను అని చెబితే అర్ద్రవంతంగా ఉండేది. ఈ నెల రోజులు నన్ను తప్పించుకు తిరిగిన వాడివి ఈ రోజు ఎలా రాగలిగావు? అని అడిగారు.

నేనేమి మాట్లాడకుండా నేల దిక్కులు చూస్తున్నాను. సమాధానం చెప్పు అని రెట్టించారు నాన్నగారు...

ఫెయిలయినందుకు తిడతారని భయపడి ఈ నెల రోజులు మీకు కనిపించడానికి భయపడ్డాను’ అని తలదించుకొనే అన్నాను.

తప్పు జరిగినప్పుడు కనిపించకుండా దూరంగా ఉండాలని అనుకోవడం తప్పు కదరా... మంచి మార్కులు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా వచ్చి చెప్పగలిగావో, ఏదైనా పొరబాటు జరిగినప్పుడు కూడా అలానే ధైర్యంగా చెప్పగలగాలి కదా అని సముదాయించారు.

ఇందాక కొట్టిన చెంపదెబ్బ నువ్ తెలియక చేసిన తప్పుకు ఆయితే, ఇప్పుడు నీకు వచ్చిన మార్కులకు నేనిచ్చే బహుమతి ఇదిగో అంటూ ఒక కవర్ చేతికందించారు. అందులో నాకు నచ్చిన జీన్స్ ప్యాంటుతో కూడిన జత బట్టలు.. ఎప్పటి నుండో అడుగుతున్నా అమ్మని. అమ్మా!! జీన్ ప్యాంటు కొనుకుంటాను డబ్బులివ్వమని. అమ్మ డబ్బులు ఇవ్వలేదు కానీ, అడక్కుండానే నాన్న గారు కొనిచ్చారు..


క్రమశిక్షణ పేరుతో మాతో కఠినంగా ఉన్నా మేమంటే ఎంతో ప్రేమ కల్గిన నాన్నగారు ఇప్పుడు మా మధ్య లేకపోవడం మాత్రం నాకు పెద్ద లోటు...
... 

2 comments:

  1. మంచి జ్ఞాపకాలు పంచుకొన్నారు :)

    ReplyDelete
  2. ధ్యాంక్స్ వర్మ గారూ..

    ReplyDelete