Saturday 28 June 2014

దేవుడు లేనిదెక్కడ?


ఆకలిగొన్నవాడికి కడుపు నిండా భోజనం పెట్టే వాడు దేవుడు కాదా?

ఆపదలో ఉన్నవాడికి నేనున్నానంటూ చేయూత యిచ్చి అదుకోనేవాడు దేవుడు కాదా?

వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకొనే కొడుకు/కూతురు దేవుడు కాదా?

ప్రతిఫలం ఆశించకుండా సమాజంలో పది మందికి చేతనైనా సాయం చేసేవాడు దేవుడు కాదా?

దేశానికి అన్నం పెట్టే రైతు దేవుడు కాదా?

ఎవరు కాదు దేవుడు??  దేవుడు అనేదాన్ని ఏ ఒక్కదానికే పరిమితం చేయలేము!!

అది అనంతం... అన్నింటిలోను ఉంది. మనం పీల్చే గాలిలో, మన ఉండే నేలలో, ఆకాశంలో, నీటిలో, అగ్నిలో ఇలా అన్నింటిలోను దైవం ఉంది.

దైవం అక్కడ, ఇక్కడ అన్న తేడా ఏమి లేకుండా అన్నింటిలోనూ ఉందని భగవధ్గీత చెప్పలేదా?

దేవుడు ఎక్కడున్నాడు అని హూంకరించిన హిరణ్యకశివుడుకి ప్రహ్లదుడు ఏమని సమాధానం ఇచ్చాడు!

అక్కడ, ఇక్కడ అని కాదు.. అంతటా దేవుడున్నాడు అని ఎంత నింపాదిగా చెప్పాడు...

దానిని నిజం చేస్తూ స్దంబం మధ్యలో నుండి దూసుకురాలేదా నరశింహ అవతారంలో ఉన్న శ్రీ మహ విష్ణువు!!!

దేవుడు ఎక్కడో లేడు.. మనలోనే ఉన్నాడు... మన ప్రపంచంలోనే ఉన్నాడు... ఒక రూపంలో కాదు. మంచి ఉన్న చోట ప్రతిచోట దేవుడున్నాడు...

అది శ్రీ మహవిష్ణువు కావచ్చు, క్రీస్తు కావచ్చు, ప్రవక్త కావచ్చు లేక సాయిబాబా కావచ్చు...

పుట్టుకతో ఎవరూ దేవుళ్ళు కాలేదు... వారి యొక్క ప్రవర్తనతో, సేవాభావంతో, ప్రజలను ప్రేమించగలిగిన గుణంతో సంపూర్ణవ్యక్తిత్తులు కాగలిగారు. జీవితంలో మనం పాటించవలసిన విలువలను, దార్శనికతను వారు పాటించి భావితరాలకు ఆదర్శంగా నిలిచారు.

రాముడైనా, కృష్ణుడైనా, యేసు అయినా, ప్రవక్త ఆయినా, సాయిబాబా ఆయినా, రమణ మహర్శి ఆయినా, బుద్దుడు ఆయినా ఎవరైనా సరే వారి జీవన విధానమును మనకు మార్గదర్శకంగా ఉంచారు... 
వారి జీవితాలను, ఆశయాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి గానీ, వారు దేవుడా కాదా అన్న విషయాలను కాదు. 


Wednesday 25 June 2014

చిత్రం – తీపి గుర్తులు



పై చిత్రం ఎంత బాగుందో కదా... ఎంత చూడముచ్చటగా ఉంది..

ఒక్కసారిగా నా బాల్య జ్ణాపకాలు గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు విద్యాభ్యాసమంతా తాతగారి  పల్లెటూరులోనే...

సాయంత్రం బడి కాగానే చెల్లితో కలిసి పొలంలో ఉన్న తాతయ్య దగ్గరకి వెళ్ళిపోయేవారం..

అదిగో ఇలానే ఎన్ని సార్లు పొలం గట్లు వెంబడి నీళ్ళలో నడుస్తూ వెళ్ళామో...

కొన్ని చిత్రాలు చూడగానే మాట్లాడతాయి.. జ్ణాపకాల దొంతరల్లోకి తీసుకువెళ్ళిపోతాయి...

ఇది కూడా అచ్చం అలాంటిదే.....

హమీలు – సమస్యలు



అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఒక్క రేంజిలో ప్రభుత్వాన్ని, చంద్రబాబునాయుడుని కడిగేసాడు తమ్మూడూ.. ఈ రోజు టి.వి. చూసావో లేదో గానీ అన్నాడు నా కొలీగ్....

జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానములు చెప్పలేక ముఖం మాడిపోయింది. రుణ మాఫీ గురించి అడిగితే అట్నుంచి సమాధానము చెప్పలేకపోయారు మళ్ళీ అన్నాడు.

ఈయన మొదట్నించి జగన్ వీరాభిమాని.. ఏమి చెప్పినా జగన్ గొప్పతనం లేకుండా, ఆయన ప్రస్తావన లేకుండా మాట్లాడకుండా ఉండలేరు.

ఆయన సంగతి, జగన్ సంగతి ప్రక్కన పెడితే అసలు రుణ మాఫీ యొక్క లక్ష్యం ఏమిటా అని ఆలోచించడం మొదలెట్టాను.  అకాల వరదలతో, వర్షాభావంతో, మద్దతు ధర అందక చితికి పోతున్న రైతుకి అర్దికంగా ఊరట కల్గించడానికి వారు బ్యాంకుల వద్ద తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం. ఆలోచన మంచిదే.. కానీ ఇది నిజంగా రైతుల మీద ప్రేమతో వారి కష్టానికి కరిగి అమలు చేస్తున్న పధకమైతే కాదని ఖచ్చితంగా చెప్పగలను.

ఎందుకంటే ఇలాంటి రుణమాఫీ కేవలం ఎన్నికల సమయంలోనే ఎందుకు చేయాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఐదేళ్ళల్లోను ఎందుకు అమలు చేయకూడదు.. అప్పుడు మాత్రం రైతులు ఇబ్బంది  పడడం లేదా? అంటే దీనికి ఈజీగా సమాధానం చెప్పోచ్చు.. కేవలం ఇది అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఎన్నికల హామీ అని.
రాజకీయ పార్టిలు వారి మేనిపోస్టొ ఇచ్చే హామీలు దీర్ఘకాలిక ప్రయెజనాలు చేకూర్చేవిధంగా ఉండాలి తప్ప, అప్పటి తమ రాజకీయ అవసరాలు తీర్చే విధంగా ఉండకూడదని మనలాంటి వారు అనుకోవడం కామనే... ఆయితే ఇలాంటి తాయిలాలు లేకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యం అన్న రాజకీయ పార్టిల వాదనను అంగీకరించలేము....

రైతులకు రుణమాఫీ హమీ ఇవ్వనందునే తమ పార్టి మొన్న జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైందని జగన్ పార్టి నేతలు వాపోయినట్టు వార్తలు వచ్చాయి.  నిజానికి చెప్పాలంటే జగన పార్టి ఓడిపోవడానికి అది కారణం కాదని, దానికి వేరే కారణాలున్నయని మనం చెప్పినా వారు అంగీకరించకపోవచ్చు.

వాటిని ప్రక్కన పెడితే, రుణ మాఫీ వల్ల రైతాంగానికి ఉన్న ప్రయెజనాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచిస్తే ఏమి లేవనే చెప్పాలి.  గత సం.రం వ్యవసాయం కోసం తీసుకున్న రుణాల్లో లక్ష యాబయి వేల వరకు మాఫీ అవడం ఒకటే రిలీఫ్.. బాగానే ఉంది. మరి తర్వాత పరిస్దితి ఏమిటి? మరల రుణం తీసుకొని వ్యవసాయం మీద పెట్టాలి. తిరిగి మరల నష్టం వస్తుంది. రుణం తీర్చలేని పరిస్దిత్ వస్తుంది. అప్పుడు మరల ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా?
అసలు రైతులు నష్టపోవడానికి గల కారణాలు, వాటిని అరికట్టడానికి తీసుకోవల్సిన చర్యలపై దృష్టి పెట్టాలి.

 వ్యవస్దగతమైన లోటుపాట్లును సవరించకుండా ఎన్ని రుణమాఫీలు చేసినా అవి రైతుల జీవనచిత్రంను మార్చలేవు,  రైతులు ఎక్కువ నష్టపోవడానికి గల కారణాల్లో ప్రధానమైనది సంప్రదాయ పంటలను విడనాడక పోవడం, వ్యవసాయ శాఖ అధికారుల నుండి తగిన సూచనలు అందకపోవడం, నాణ్యమైన విద్యుత్ ని అందించలేకపోవడం, కూలీల కొరత,  నాసిరకం విత్తనాలు, నాసిరకం ఎరువులు, చెరువలను, పుంతలను, సాగునీటి కాల్వలను అదునీకరించకపోవడం,  ముఖ్యంగా వెనుకటి తరాల రైతుల్లో వ్యవసాయంపై ఉన్నటు వంటి పూర్తి స్దాయి పరిజ్ణానం ఇప్పటి రైతుల్లో లేకపోవడం  వంటి కారణాలు వలన రైతు నష్టానికి లోను అవుతున్నాడు.


రుణమాఫీ చేయడానికి రమారమి ముప్పైవేల కోట్లు అవసరమవుతాయని వార్తలు వచ్చాయి. నిజానికి యింత మొత్తముతో రుణమాఫీ చేసే బదులు ఆ ఖర్చుని రైతు ప్రతిబంధకాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించడం మీద పెడితే రైతులకు దీర్ఘకాలిక ప్రయెజనం చేకూర్చినట్టు అవుతుంది. అలానే నకిలీ విత్తనాలు, నకీలు ఎరువులు అమ్మే ఏజెన్సిలపై కఠిన చర్యల తీసుకోవాలి. అంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇంక ఎవరు కూడా నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ అమ్మాలంటేనే భయపడే విధంగా ఉండాలి. అలానే విత్తనాలు, ఎరువుల ధరలు ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చట్టం తేవాలి. గ్రిప్ వాటర్ సిస్టమ్ ని ప్రతి రైతుకి అందుబాటులో ఉండేలా చేయాలి. దాని ద్వారా నీటిని అదా చేయవచ్చు. సంప్రదాయ పంటలు నుండి వాణిజ్య తరహ పంటలు వేసేలా రైతులను ఒప్పించాలి. సంప్రదాయ ఎరువలను రైతులే తయారుచేసుకొనే విధంగా ప్రొత్సాహించడం, దానికి తగిన సూచనలు అందించడం  చెప్పుకుంటే పోతే చాలనే ఉన్నాయి. వీటన్నింటిని ప్రణాళిక బద్దంగా చేపడితే ఫలితం సాధించడం పెద్ద కష్టమేమి కాబోదు. పైగా వీటికి ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదు.  ఇలాంటి ప్రతిబంధకాలన్నింటిని ప్రభుత్వం తొలగించగలిగితే రైతులకు రుణమాఫీ చేయవలసిన అవసరం ఎన్నడూ రాదు.  ఇంకా వీటి గురించి రాయాలంటే చాలానే ఉంది. కానీ ఒక పోస్టులో సరిపెట్టలేము దీనిని.