Wednesday 25 June 2014

హమీలు – సమస్యలు



అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఒక్క రేంజిలో ప్రభుత్వాన్ని, చంద్రబాబునాయుడుని కడిగేసాడు తమ్మూడూ.. ఈ రోజు టి.వి. చూసావో లేదో గానీ అన్నాడు నా కొలీగ్....

జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానములు చెప్పలేక ముఖం మాడిపోయింది. రుణ మాఫీ గురించి అడిగితే అట్నుంచి సమాధానము చెప్పలేకపోయారు మళ్ళీ అన్నాడు.

ఈయన మొదట్నించి జగన్ వీరాభిమాని.. ఏమి చెప్పినా జగన్ గొప్పతనం లేకుండా, ఆయన ప్రస్తావన లేకుండా మాట్లాడకుండా ఉండలేరు.

ఆయన సంగతి, జగన్ సంగతి ప్రక్కన పెడితే అసలు రుణ మాఫీ యొక్క లక్ష్యం ఏమిటా అని ఆలోచించడం మొదలెట్టాను.  అకాల వరదలతో, వర్షాభావంతో, మద్దతు ధర అందక చితికి పోతున్న రైతుకి అర్దికంగా ఊరట కల్గించడానికి వారు బ్యాంకుల వద్ద తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం. ఆలోచన మంచిదే.. కానీ ఇది నిజంగా రైతుల మీద ప్రేమతో వారి కష్టానికి కరిగి అమలు చేస్తున్న పధకమైతే కాదని ఖచ్చితంగా చెప్పగలను.

ఎందుకంటే ఇలాంటి రుణమాఫీ కేవలం ఎన్నికల సమయంలోనే ఎందుకు చేయాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఐదేళ్ళల్లోను ఎందుకు అమలు చేయకూడదు.. అప్పుడు మాత్రం రైతులు ఇబ్బంది  పడడం లేదా? అంటే దీనికి ఈజీగా సమాధానం చెప్పోచ్చు.. కేవలం ఇది అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఎన్నికల హామీ అని.
రాజకీయ పార్టిలు వారి మేనిపోస్టొ ఇచ్చే హామీలు దీర్ఘకాలిక ప్రయెజనాలు చేకూర్చేవిధంగా ఉండాలి తప్ప, అప్పటి తమ రాజకీయ అవసరాలు తీర్చే విధంగా ఉండకూడదని మనలాంటి వారు అనుకోవడం కామనే... ఆయితే ఇలాంటి తాయిలాలు లేకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యం అన్న రాజకీయ పార్టిల వాదనను అంగీకరించలేము....

రైతులకు రుణమాఫీ హమీ ఇవ్వనందునే తమ పార్టి మొన్న జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైందని జగన్ పార్టి నేతలు వాపోయినట్టు వార్తలు వచ్చాయి.  నిజానికి చెప్పాలంటే జగన పార్టి ఓడిపోవడానికి అది కారణం కాదని, దానికి వేరే కారణాలున్నయని మనం చెప్పినా వారు అంగీకరించకపోవచ్చు.

వాటిని ప్రక్కన పెడితే, రుణ మాఫీ వల్ల రైతాంగానికి ఉన్న ప్రయెజనాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచిస్తే ఏమి లేవనే చెప్పాలి.  గత సం.రం వ్యవసాయం కోసం తీసుకున్న రుణాల్లో లక్ష యాబయి వేల వరకు మాఫీ అవడం ఒకటే రిలీఫ్.. బాగానే ఉంది. మరి తర్వాత పరిస్దితి ఏమిటి? మరల రుణం తీసుకొని వ్యవసాయం మీద పెట్టాలి. తిరిగి మరల నష్టం వస్తుంది. రుణం తీర్చలేని పరిస్దిత్ వస్తుంది. అప్పుడు మరల ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా?
అసలు రైతులు నష్టపోవడానికి గల కారణాలు, వాటిని అరికట్టడానికి తీసుకోవల్సిన చర్యలపై దృష్టి పెట్టాలి.

 వ్యవస్దగతమైన లోటుపాట్లును సవరించకుండా ఎన్ని రుణమాఫీలు చేసినా అవి రైతుల జీవనచిత్రంను మార్చలేవు,  రైతులు ఎక్కువ నష్టపోవడానికి గల కారణాల్లో ప్రధానమైనది సంప్రదాయ పంటలను విడనాడక పోవడం, వ్యవసాయ శాఖ అధికారుల నుండి తగిన సూచనలు అందకపోవడం, నాణ్యమైన విద్యుత్ ని అందించలేకపోవడం, కూలీల కొరత,  నాసిరకం విత్తనాలు, నాసిరకం ఎరువులు, చెరువలను, పుంతలను, సాగునీటి కాల్వలను అదునీకరించకపోవడం,  ముఖ్యంగా వెనుకటి తరాల రైతుల్లో వ్యవసాయంపై ఉన్నటు వంటి పూర్తి స్దాయి పరిజ్ణానం ఇప్పటి రైతుల్లో లేకపోవడం  వంటి కారణాలు వలన రైతు నష్టానికి లోను అవుతున్నాడు.


రుణమాఫీ చేయడానికి రమారమి ముప్పైవేల కోట్లు అవసరమవుతాయని వార్తలు వచ్చాయి. నిజానికి యింత మొత్తముతో రుణమాఫీ చేసే బదులు ఆ ఖర్చుని రైతు ప్రతిబంధకాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించడం మీద పెడితే రైతులకు దీర్ఘకాలిక ప్రయెజనం చేకూర్చినట్టు అవుతుంది. అలానే నకిలీ విత్తనాలు, నకీలు ఎరువులు అమ్మే ఏజెన్సిలపై కఠిన చర్యల తీసుకోవాలి. అంటే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇంక ఎవరు కూడా నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ అమ్మాలంటేనే భయపడే విధంగా ఉండాలి. అలానే విత్తనాలు, ఎరువుల ధరలు ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చట్టం తేవాలి. గ్రిప్ వాటర్ సిస్టమ్ ని ప్రతి రైతుకి అందుబాటులో ఉండేలా చేయాలి. దాని ద్వారా నీటిని అదా చేయవచ్చు. సంప్రదాయ పంటలు నుండి వాణిజ్య తరహ పంటలు వేసేలా రైతులను ఒప్పించాలి. సంప్రదాయ ఎరువలను రైతులే తయారుచేసుకొనే విధంగా ప్రొత్సాహించడం, దానికి తగిన సూచనలు అందించడం  చెప్పుకుంటే పోతే చాలనే ఉన్నాయి. వీటన్నింటిని ప్రణాళిక బద్దంగా చేపడితే ఫలితం సాధించడం పెద్ద కష్టమేమి కాబోదు. పైగా వీటికి ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదు.  ఇలాంటి ప్రతిబంధకాలన్నింటిని ప్రభుత్వం తొలగించగలిగితే రైతులకు రుణమాఫీ చేయవలసిన అవసరం ఎన్నడూ రాదు.  ఇంకా వీటి గురించి రాయాలంటే చాలానే ఉంది. కానీ ఒక పోస్టులో సరిపెట్టలేము దీనిని. 


No comments:

Post a Comment