Monday 10 November 2014

ధృతరాష్ట కౌగిలి



మొన్నటి ఎన్నికల్లో కేంద్రం మరియు రాష్ట్రంలో అధికారం నుండి దుష్ట కాంగ్రెసుని ఎలాగైనా పాతరేయాలని నిశ్చయించుకొని ఆ పని కానిచ్చేసి మంచి పని చేసామన్న భావనలో ఉన్న నాలాంటి చాలా మందికి ప్రస్తుత బి.జి.పి. విధానాలు చూస్తుంటే పునరాలోచనలో పడేటట్టుగా చేస్తుందేమో అన్న అనుమానం కల్గుతుంది.

బి.జె.పి. కాంగ్రెసుకు పూర్తిగా భిన్నమైన పార్టి అని, దానికిలా అవకాశవాద రాజకీయాలకు పాల్పడదని, ప్రజలు లేదా ప్రాంత ప్రయెజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తే, దాని అంత పెద్ద జోక్ ఇంకొకటి లేదని బల్ల గుద్ది చెప్పొచ్చు.

ఈ మధ్య కాలంలో మరియు విభజన బిల్లుకి మద్దతు విషయంలో దాని విధానం చూస్తే కాంగ్రెసుకి, వీరికి పెద్దగా తేడా ఏమి లేదని అర్ద్రం చేసుకోవచ్చు. ఊడగొట్టుకోవడానికి ఏ రాయి ఆయితేనేమి అన్న పరిస్దితిలో మనం ఉన్నాం.

మొన్నటి ఎన్నికల్లో తమకొచ్చిన మెజారిటీని చూసి అది పూర్తిగా తమ గొప్పతనంగా భావించి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తే దానిని శుద్ద తప్పుగా చెప్పొచ్చు.  వాస్తవానికి  కాంగ్రెసు పార్టి మీద ఉన్న వ్యతిరేకతతోనే అఖండ మెజారిటీ సాధించింది తప్ప తన సొంత అజెండాకి దక్కిన మద్దుతుతో కాదు.  పైగా ఆ పార్టికి దక్షిణాదిలో సరయిన కేడర్ అనేదే లేదు. ప్రాంతియ పార్టిలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఇప్పటి వరకు తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది.

గత పదేళ్ళుగా కాంగ్రెసు ప్రభుత్వ పాలనతో, కుంభకోణాలతో విసిగిపోయి ప్రత్యామ్నయంగా బి.జె.పి.ని ఎన్నుకున్నారన్న విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఆయితే కాంగ్రెసును కాదనుకున్నందునే బి.జె.పి.కి అధికారం దక్కిందంటే తొంభయి శాతం ఆవుననే చెప్పోచ్చు.  ఆ విధంగా ఆయితే బి.జె.పి. మాత్రమే ఎందుకు లాభపడాలి. మిగతా పార్టిలు కూడా లాభపడాలి కదా అని మనకి అనిపించొచ్చు. ఆయితే ఇక్కడ బి.జె.పి. తన ప్రొడక్టు ఆయిన మోడీని ప్రజల్లోకి బాగా ముందుగానే  పబ్లిష్ చేసింది. మరియు దేశవ్యాప్తంగా కాంగ్రెసు తప్పితే ఒక్క బి.జె.పి.కి మాత్రమే చెప్పుకోదగ్గ కేడర్ ఉంది. మిగతా పార్టీలు ఆయా ప్రాంతాల్లో ఎంతో కొంత పట్టు ఉన్నప్పట్టీకీ ఆ ఒక్కటీ సరిపోలేదు.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు మీద పీకల్దాక కోపంతో ఉన్నారు సీమాంధ్ర ప్రజలు.  సీమాంధ్ర ప్రయెజనాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నియంత తరహాలో పార్లమెంటు తలుపులు బిగించి రాష్ట్రం విడగొట్టడం అన్న విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న సీమాంధ్ర్ ప్రజలు అందుకు ప్రతిగా ఆ పార్టికి ఒక్క స్దానం కూడా దక్కనీయకుండా చేసారు. వాస్తవానికి అందులో కాంగ్రెసుతో పాటుగా బి.జె.పి. పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. బి.జె.పి. సపోర్ట్ లేకుండా బిల్లు పాస్ ఆయ్యే అవకాశం లేదని గొర్రెలు కాసుకోనేవాడికి కూడా తెలుసు. మరి విభజన పాపంలో కాంగ్రెసుతో పాటుగా బి.జె.పి.కి కూడా పాత్ర ఉన్నప్పుడూ దానిని కూడా ప్రజలు తిరస్కరించాలి కదా... అలా చేయలేదంటే దానికి కారణం వేరే ప్రత్యామ్నయం లేకే ఎన్నుకోవలసి వచ్చిందన్నది వాస్తవమే.  

ఇకపోతే ఇక్కడ చంద్రబాబు ఉండడం వలన అక్కడ బి.జె.పి ఉండడం వలన రాష్ట్రానికి ఏదో అభివృద్ది జరిగిపోతుందని ప్రతి ఒక్కరూ భావించారు. ఆయితే చంద్రబాబు చతురత ఏ పాటిదో రాష్ట్ర విభజనకి బి.జె.పి. బేషరతు మద్దతు ప్రకటించినపుడే తేలిపోయింది.  రాష్ట్ర విభజన సమయంలో బిల్లు పాసు కావాలంటే బి.జె.పి.మద్దతు అనివార్యమైన పరిస్దితుల్లో చంద్రబాబు రంగ ప్రవేశం చేయడంతో బి.జె.పి.లోను పెద్దలను తన నియంత్రణలోకి తెచ్చుకోవడం ద్వారా బిల్లునకు వ్యతిరేకంగా అపుజేయించగలరని చాలా మంది ఆశించారు. కాని అలాంటిదేమి జరగలేదు.

రాష్ట్రంను విభజించడం ద్వారా తన లబ్ది చూసుకోవడానికి కాంగ్రెసు ప్రయత్నిస్తే, మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ దానికి ధీటుగా అవకాశ రాజకీయాలకు తెగబడింది తప్పితే ప్రజల ప్రయెజనాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయం ప్రజలు ఎందుకనో కాని పెద్దగా పట్టించుకొన్నట్టు లేదు.  చేయవలసిదంతా చేసేసి ఇద్దరు కల్సి చేసిన తప్పుని కాంగ్రెసుమీదకి నెట్టేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుని సరిచేస్తామని డాంబికాలు పలికింది. ఇక్కడెమో పదేళ్ళు పాటు అధికారంనకు దూరంగా ఉండిపోయి, ఈ సారి ఎలాగైనా గద్దెనెక్కి తీరాల్చిందే అన్న పరిస్దితుల్లో ఉన్న బాబు అధికారం దక్కించుకోవడమే ప్రధాన ధ్యేయంగా బి.జె.పి.తో చేతులు కలిపారు. ఆయితే ఇక్కడ కూడా కాంగ్రెసు మీద వ్యతిరేకతే టి.డి.పి.కి ఉపయెగపడింది తప్పితే స్వంత గ్లామర్ కారణంగా అని మాత్రం చెప్పలేము. జగన్ కున్న ఇమేజ్ కూడా టి.డి.పి.కి ప్లస్ ఆయింది. ఆయితే టి.డి.పి.తో పొత్తు విషయంలో కూడా ఎటువంటి కేడర్ లేని సీమాంధ్ర ప్రాంతంలో కూడా చివరి దాకా ఎగస్ట్రాలు చేసింది. ఒకానొక దశలో చంద్రబాబు విసిగిపోయి పొత్తు వదులుకుందామనుకున్న సమయంలో మెట్టు దిగి రాయబారాలు నెరపి పొత్తు నిలబెట్టుకున్నారు.

బి.జె.పి. ముందున్న ప్రస్తుత లక్ష్యం దేశాన్ని అమాంతం అభివృద్ధి పధంలోకి పరిగెత్తించడం అనుకున్నా. ఆయితే దాని లక్ష్యం దేశంలో అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ వేళ్ళునడానికి ఎన్ని ఎధవ పనులు చేయాలో అన్ని చేయడమే.  ప్రభుత్వపరంగా చూస్తే మోడీ పనితీరు బాగానే ఉంది. కానీ పార్టీ పరంగా చూస్తే దాని విధానాలు కాంగ్రెసు విధానాలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు.  పార్టీ విస్తరించడానికి ఎటువంటి దారినైనా ఎంచుకోవడానికి సిద్దపడుతున్న వైనం చూస్తుంటే అసహ్యం కలగక మానదు. తెలంగాణాలో పార్టీ విస్తరణ కోసం అసమగ్ర విభజనకి సై చెప్పిన బి.జె.పి. ఇటూ ఆంధ్రలో వచ్చిన వ్యతిరేకతను తగ్గించుకోవడానికి తాము అధికారంలోకి రాగానే పరిస్దితులను చక్కదిద్దుతామన్న హామితో ముందుకు వచ్చింది. ఆయితే ఇప్పటికీ ఐదు నెలలు కాలం గడిచినప్పటికీ బి.జె.పి. చెప్పినటువంటి దిద్దుబాటు చర్యలు మచ్చుకు ఒక్కటీ కానరాలేదు.

సీమాంధ్రకి బి.జె.పి. చేసినది ఏమి లేకపోయినా, ఇప్పుడు కాంగ్రెసు కారణంగా ఏర్పడిన రాజకీయ శూన్యతని తాము భర్తీ చేయాలని పాపులు కదుపుతుంది. వచ్చే ఎన్నికల్లో టి.డి.పి.కి ప్రధాన పోటిదారుగా అవతరించినా  ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఆ దిశగా పాపులు కదుపుతుంది. నాకు తెల్చి 2019 ఎన్నికల్లో చంద్రబాబు పరిస్దితి ప్రస్తుత శివసేన పరిస్దితి ఫేస్ చేయెచ్చునేమో అనిపిస్తుంది.  ఈ విషయమై చంద్రబాబు కూడా సాధ్యమైనంత త్వరగా జాగత్రపడవలసిన అవసరముంది అనిపిస్తుంది.  

బలం లేని చోట మిత్రపక్షాల పేరుతో ఏదొక పార్టి పంచన చేరి, తద్వారా ఆ పార్టికే ఎసరు పెట్టే రాజకీయాలను మొన్నటికి మొన్నే మహరాష్ట్ర ఎన్నికల్లో చూసాము. శివసేన సాయం లేకుండా బి.జె.పి. ఈ స్దితికి వచ్చిందంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు.  ఇప్పుడు తన మిత్రపక్షంను లొంగదీసుకోవడానికి అవినీతిమయమైన ఎన్.సి.పి.తో జట్టు కట్టడానికి కూడా సిద్దపడిందంటే ఆ పార్టి విధానం ఎంత గొప్పగా ఉందో అర్ద్రం చేసుకోవచ్చు. ఎన్నికల్లో ఎన్.సి.పి.అవినీతిని ఒక అంశంగా తీసుకొని ప్రచారం నిర్వహించిన బి.జె.పి. నేడు ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టి అఫర్ చేసిన మద్దతుని  రిజెక్ట్ చేయకపోవడం చూస్తే ప్రజల ప్రయెజనాల కన్నా అధికార ప్రయెజనాలే మిన్న అన్న విషయం సృష్టమవుతుంది. ప్రస్తుత బి.జె.పి. అధ్యక్షుడిని చూస్తుంటే కాంగ్రెస్ వాదుల కన్నా రెండాకులు ఎక్కువే చదివినట్టుగా ఆగుపిస్తున్నారు.

ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయమై కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే, ఇలాంటి వారినా మనం ఎన్నుకొన్నది అనిపిస్తుంది. తన దుందుడుకు చర్యలతో విభజన చట్టాన్ని, ఉమ్మడి ప్రయెజనాలను పరిహసిస్తున్న తెలంగాణ ప్రభుత్వంను నిలువరించడకుండా చోద్యం చూడడం కాకతాళీయమేమి కాదు. తెలంగాణాలో బలపడాలన్న ఆశయంతోనే తగవులను చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుంది. ఇటూ చంద్రబాబు కూడా సీమాంధ్ర ప్రయెజనాలను గాలికొదిలేసి తెలంగాణాలో పార్టీని కాపాడుకొనే లక్ష్యంతో పనిచేస్తుండడంతో సీమాంధ్ర వాదనను బలంగా తీసుకెళ్ళడం లేదు.  అందుకు ప్రత్యామ్నయంగా తెలంగాణా ప్రభుత్వాన్ని చికాకు పెట్టే చర్యలకు ఆంధ్ర ప్రభుత్వం తెగబడుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ప్రశ్నిస్తే, మరి నువ్ అలా చేయలేదా అని ప్రశ్నించడం పరిపాలనగా ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల పాలన సాగుతుందంటే దానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం అవకాశవాదము వలనే.

Picture courtesy: Google